- ప్రధాని మోదీ, ఆర్మీ చీఫ్ మధ్య విభేదాలంటూ పాక్ దుష్ప్రచారం
- సోషల్ మీడియా వేదికగా భారత్పై విషం చిమ్ముతున్న దాయాది
- పాకిస్థాన్ నుంచే ఈ ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడి
- గతంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఇదే తరహా కుట్రలు
- ఇలాంటి వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
కేంద్ర ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ద్వారా పాకిస్థాన్ ఆధారిత సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పీఐబీ స్పష్టం చేసింది. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పాకిస్థాన్ చేస్తున్న కుట్రలో భాగమే అని వెల్లడించింది.
కొన్ని ‘ఎక్స్’ ఖాతాల నుంచి ఒకే రకమైన సందేశాలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ సందేశాల ప్రకారం, భారత సైన్యం పాకిస్థాన్తో ఘర్షణకు సిద్ధంగా లేదని, సైనిక సామగ్రిని ఆధునికీకరించడానికి ప్రభుత్వం సహకరించడం లేదని ఆర్మీ అధికారులు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నాయి. ఈ పోస్టులన్నీ పాకిస్థాన్ నుంచే నడుస్తున్నాయని పీఐబీ గుర్తించింది. భారత ప్రభుత్వం, సైన్యం మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారని పీఐబీ తేల్చి చెప్పింది.
గతంలో ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కూడా పాకిస్థాన్ ఇలాంటి తప్పుడు ప్రచారాలే చేసిందని పీఐబీ గుర్తు చేసింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని, ఏదైనా వార్తను ధ్రువీకరించుకోవడానికి అధికారిక మాధ్యమాలను మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించింది. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రజల్లో గందరగోళం సృష్టించే ఇలాంటి ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు పౌరులందరినీ హెచ్చరించారు.
